మన పత్రిక వెబ్డెస్క్, శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ 11 రోజుల ఉత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం కావడంతో, ఆ రోజున భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, గతేడాదితో పోలిస్తే ఈసారి 20 నుంచి 30 శాతం అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఈవో ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు.
ముఖ్యంగా భక్తులకు ప్రసాదం పంపిణీలో జాప్యం జరగకుండా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌలభ్యం కోసం అదనంగా మరో 20 లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మొత్తం లడ్డూ కౌంటర్ల సంఖ్య 30కి చేరనుంది. అలాగే, ఉత్సవాలు ప్రారంభం కాకముందే భక్తుల రాక మొదలయ్యే అవకాశం ఉన్నందున, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. అన్న ప్రసాద వితరణ కోసం స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోనున్నారు.
నల్లమల అటవీ మార్గం ద్వారా కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై ఇంజనీరింగ్, అటవీ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి. నాగలూటి, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారం, సాక్షి గణపతి వంటి ప్రాంతాల్లో అవసరమైన సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. పాతాళగంగ స్నానఘట్టాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు, మెట్ల మార్గంలో మరమ్మతులు, క్యూ లైన్ల నిర్వహణ, అదనపు పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
