Advertisement

గోదావరి నీళ్లు సముద్రం పాలు.. ఆ వ్యాఖ్యలు సరికాదు: ఎమ్మెల్యే సోమిరెడ్డి

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఏటా సుమారు 2,000 నుంచి 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, వీటి వినియోగంపై వివాదాలు సృష్టించడం సరికాదని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. అంతర్రాష్ట్ర జలాల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, నీటిని రాజకీయ అస్త్రంగా మార్చొద్దని ఆయన మండిపడ్డారు. విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో ఉన్నారని గుర్తుచేశారు.

గతంలో రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా సోమిరెడ్డి ప్రస్తావించారు. అనుమతులు ఉన్న బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలొద్దని, రెండు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు భేటీ అయి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. మరోవైపు కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ప్రతిపాదన రెండు రాష్ట్రాలకు ప్రమాదకరమని, దీనిపై తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

తెలుగు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సఖ్యతతో ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement