Advertisement

సింగరేణిలో 43 మంది తొలగింపు బాధితులకు మళ్లీ ఉద్యోగ అవకాశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ( SCCL ) లో గతంలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా నియమించబడి.. కొన్ని కారణాల వలన తొలగింపుకు గురైన 43 మంది అభ్యర్థులకు మళ్లీ విధుల్లో చేరే అవకాశం లభించింది. కంపెనీ సీఎండీ ఎన్. బలరామ్ ఆదేశాల మేరకు యాజమాన్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయం వెనుక పలు పరిపాలనా పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలగింపుకు ప్రధాన కారణాలు విధులకు గైర్హాజరు కావడం, అవసరమైన విద్యా, సాంకేతిక సర్టిఫికెట్లను సమర్పించకపోవడం.

Advertisement

అయితే ఇటీవల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో సింగరేణి యాజమాన్యం, గుర్తింపు పొందిన కార్మిక సంఘం మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం, బాధితులను మళ్లీ సంస్థలోకి తీసుకోవాలని తుది నిర్ణయం తీసుకున్నారు.

యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. తిరిగి చేరే అభ్యర్థులు హై పవర్ కమిటీ ఎదుట తగిన పత్రాలు సమర్పించాలి. ముఖ్యంగా ఓవర్‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ వంటి మైనింగ్ సాంకేతిక అర్హతలను చూపించాల్సి ఉంటుంది.

వీటితో పాటు శారీరక దృఢత్వం (ఫిట్‌నెస్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కూడా తప్పనిసరి. అన్ని అర్హతలు ఉన్నవారికి మాత్రమే మళ్లీ నియామకాలు కల్పిస్తామని సీఎండీ బలరామ్ స్పష్టం చేశారు.

Advertisement