Advertisement

హైదరాబాద్ నేపథ్యంలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా

మన పత్రిక: కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలసి పనిచేస్తున్న ‘స్పిరిట్’ చిత్రం కథాంశం ప్రధానంగా హైదరాబాద్‌లోనే సాగనుందని సమాచారం. నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ పాన్-ఇండియా ఇమేజ్ కారణంగా ఈ సినిమా విదేశీ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటుందని కొందరు భావించినప్పటికీ, కథను ఒకే నగరం చుట్టూ నడపడం ద్వారా స్క్రీన్‌ప్లేకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా నటించనున్నారు. పాత్రల మానసిక విశ్లేషణ, భావోద్వేగాలు, సంఘర్షణలపై ఎక్కువ దృష్టి పెట్టే సందీప్ రెడ్డి వంగా, తన మునుపటి చిత్రం ‘యాన్సిమల్’ లాగానే ఇందులోనూ పాత్రల తీవ్రతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్పిరిట్ చిత్రంలో త్రిప్తి డిమ్రి కథానాయికగా ఎంపికయ్యారు.

Advertisement

పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న థియేటర్లలో విడుదలయ్యేలా ప్రస్తుతం ప్రణాళిక చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్‌తో కలసి ‘యాన్సిమల్ పార్క్’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Advertisement