Advertisement

పోలవరంపై సుప్రీం బాట.. చంద్రబాబు ప్రాజెక్టుపై రేవంత్ న్యాయ పోరాటం

మన పత్రిక, వెబ్​డెస్క్: గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరుతో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. గతంలో ప్రతిపాదించిన ‘బనకచర్ల’ ప్రాజెక్టును కేంద్ర జలసంఘం నిరాకరించడంతో, చంద్రబాబు వ్యూహం మార్చి రూ. 58,700 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటిని ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ కుడి కాలువ, బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా నల్లమలసాగర్‌కు మళ్లించాలన్నది ఈ పథకం ఉద్దేశం.

అయితే, దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని రేవంత్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చంద్రబాబుతో రేవంత్‌కు ఉన్న గత అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, గురుదక్షిణగా ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్నారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది. కేంద్రంలో, ఏపీలో ఎన్‌డీయే కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే ఈ వివాదాన్ని కేంద్ర జలసంఘం, కృష్ణా-గోదావరి బోర్డులతో పాటు నేరుగా సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించింది.

Advertisement

గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తున్నప్పుడు, ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనపు వాటా దక్కాలన్నది ప్రధాన డిమాండ్. పోలవరం ముంపు, పర్యావరణ అనుమతులు, నదీ జలాల పునఃపంపిణీ వంటి అన్ని అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ న్యాయ పోరాటంలో బీఆర్ఎస్ కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement