PM Kisan Samman Nidhi yojana: రైతులకు పంట సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి మూడు విడతలుగా ఆర్థిక సాయం అందిస్తుంటుంది. ప్రతి విడతలో రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో నేరుగా రైతుల అకౌంట్లలోనే జమ అవుతుందన్నది తెలిసిందే.
ఇప్పటివరకు 20 విడతల్లో సాయం అందించగా, చివరిసారి ఆగస్టు 2న 20వ విడత నిధులు విడుదల అయ్యాయి. ఇప్పుడు రైతులు 21వ విడత కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పలు ఆంగ్ల మీడియా రిపోర్టుల ప్రకారం, దీపావళి పండుగకు ముందు నిధులు జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో డబ్బులు విడుదల కావడం ఈ అంచనాలను బలపరుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సెప్టెంబర్ 26న పీఎం కిసాన్ నిధులు విడుదల చేయగా, జమ్మూ అండ్ కశ్మీర్లో అక్టోబర్ 7న రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులు తమ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ఇ-కేవైసీ (eKYC) పూర్తి చేయాలి. దీన్ని మూడు విధాలుగా చేసుకోవచ్చు — పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ ఆధారిత కేవైసీ, కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) ద్వారా బయోమెట్రిక్ కేవైసీ, లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా.
రైతులు తమ బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in
లోకి వెళ్లి “Beneficiary Status” పేజీలో ఆధార్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
కొందరు రైతులకు నిధులు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఒక కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే, వారిని అనర్హులుగా గుర్తిస్తారు. ఆధార్, బ్యాంకు లేదా భూమి రికార్డుల్లో పొరపాట్లు ఉన్నా పేమెంట్ నిలిపివేయబడే అవకాశం ఉంది.
దీంతో పాటు ఇ-కేవైసీ పూర్తి చేయకపోతే నిధులు జమ కావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఇంకా కేవైసీ చేయని రైతులు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
