Advertisement

రాజకీయాలు మనవి కావు.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో మర్యాద, విలువలు, ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ అసలైన విధానమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంత్రులతో నిర్వహించిన అల్పాహార విందు సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పాలనలో అనుసరించాల్సిన విధానాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీ అనుసరిస్తున్న దౌర్జన్య రాజకీయాలకు టీడీపీ పూర్తి భిన్నమని, బెదిరింపులు, ‘రప్పా రప్పా’ సంస్కృతి తమకు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.

ప్రజాసేవే మన అజెండా ఎన్నికల్లో గెలిచామా లేదా అన్నదానికంటే, ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే మన అసలైన అజెండా కావాలని లోకేష్ మంత్రులకు సూచించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, వారి మధ్యే ఉంటూ సమస్యలను పరిష్కరించాలన్నారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండి, అబద్ధాలను నిజాలతో తిప్పికొట్టాలని హితవు పలికారు.

Advertisement

ఫిర్యాదులపై తక్షణ చర్యలు ప్రజావేదికల ద్వారా వచ్చే ఫిర్యాదులను కేవలం నమోదు చేసి వదిలేయకుండా, వాటి పరిష్కార బాధ్యతను మంత్రులే స్వయంగా తీసుకోవాలని లోకేష్ స్పష్టం చేశారు. ఒక్కో సమస్య పరిష్కారమే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందన్నారు. పార్టీ బలోపేతానికి క్యాడర్ కీలకమని, కార్యకర్తలకు అండగా నిలవడంలో ఇన్‌ఛార్జి మంత్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

Advertisement