Advertisement

Nalgonda: సూపర్ స్మార్ట్ సిటీగా మార్చాలి.. కొత్త కమిషనర్‌కు మంత్రి కోమటిరెడ్డి దిశానిర్దేశం

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శరత్ చంద్ర గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్‌కు మంత్రి అభినందనలు తెలిపి శుభాకాంక్షలు చెప్పారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కమిషనర్ మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణ అభివృద్ధి, పరిపాలన విషయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఈ సందర్భంగా కమిషనర్‌కు సూచించారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత నల్గొండను కార్పొరేషన్‌గా సాధించుకున్నామని మంత్రి గుర్తుచేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలోనే నల్గొండ అగ్రగామిగా నిలిచేలా కష్టపడి పనిచేయాలని, దీనిని ఒక ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి కోమటిరెడ్డి దిశానిర్దేశం చేశారు.

Advertisement

ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఇటీవల చేపట్టిన పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘సూపర్ స్మార్ట్ సిటీ’ అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తున్నామని, అందుకు అనుగుణంగా పరిపాలనలో పారదర్శకత పాటిస్తూ, వేగవంతమైన అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నూతన కమిషనర్ శరత్ చంద్రకు సూచించారు.

Advertisement