మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తా సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను బలితీసుకుంది. మద్యం మత్తులో కారు నడుపుతున్న కనకాల రామ్కుమార్ రెడ్డి.. ముందుగా రోడ్డు దాటుతున్న శ్రీధర్ అనే వ్యక్తిని, ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న నల్గొండ జిల్లా అల్వాలకు చెందిన కంచర్ల శివ(20), మిర్యాలగూడకు చెందిన నకిరేకంటి సందీప్ కుమార్(19) మృతి చెందారు. వీరు బండ్లగూడలోని మహావీర్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ, ఖర్చుల కోసం ఆన్లైన్ డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. ఓంకార్నగర్లో డెలివరీ ఇచ్చి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
కారు వీరిని 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి బోల్తా పడింది. నిందితుడు రామ్కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించగా రక్తంలో మద్యం మోతాదు 150 ఉన్నట్లు గుర్తించారు.
