Advertisement

హనీమూన్ హత్య కేసులో సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

మన పత్రిక: Honeymoon Murder Case లో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీకి గతంలో మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరాలేలతో కూడిన అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. మూడు వారాల వ్యవధిలో ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని నిందితురాలిని కోర్టు ఆదేశించింది.

ఇండోర్‌కు చెందిన సోనమ్ రఘువంశీ, రాజా రఘువంశీల వివాహం జరిగిన తర్వాత గత ఏడాది మే నెలలో వారు మేఘాలయకు హనీమూన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పర్యటనలో ఉన్న సమయంలో ఇద్దరూ కనిపించకుండా పోయారు. వారం రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహం ఒక లోతైన లోయలో లభ్యమైంది. ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఆర్థిక ప్రయోజనాల కోసం అద్దె హంతకులతో ఈ హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలడంతో 2025 జూన్‌లో పోలీసులు సోనమ్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement

అరెస్ట్ మెమో నమోదులో దొర్లిన సాంకేతిక కారణాలను చూపుతూ షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో సోనమ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను మేఘాలయ హైకోర్టు జూన్ చివరిలో సమర్థించగా, మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా మేఘాలయ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, అరెస్ట్ మెమోలో దొర్లిన తప్పు కేవలం టైపింగ్ పొరపాటు మాత్రమేనని, నిందితురాలు బయట ఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు.

వాదనలు విన్న సుప్రీంకోర్టు, అరెస్ట్ మెమోలోని చిన్నపాటి లోపం బెయిల్‌కు అర్హత కాదని స్పష్టం చేస్తూ బెయిల్‌ను రద్దు చేసింది. మూడు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, విచారణ క్రమంలో ఎలాంటి పురోగతి లేకపోతే ఆరు నెలల తర్వాత సోనమ్ మళ్లీ కొత్తగా బెయిల్ పిటిషన్ వేసుకునే వెసులుబాటును ధర్మాసనం కల్పించింది.

Advertisement