Advertisement

తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి

Admissions in Government junior colleges 2025 : ఈ 2025 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఫస్టియర్లో 92,117 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 8,482 మంది ఎక్కువ.

రాష్ట్రంలో మొత్తం 3,292 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది ఫస్టియర్లో మొత్తం 5,01,129 మంది విద్యార్థులు అడ్మిషన్లు సాధించారు. అయితే ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గాయి. గతేడాది 3,39,176 మంది చేరితే, ఈ ఏడాది 3,14,371 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. అంటే 24,805 మంది తక్కువ.

Advertisement

ప్రభుత్వ కళాశాలల్లో వసతులు మెరుగుపడడం, కొత్త జూనియర్ లెక్చరర్ల నియామకం, పోటీ పరీక్షలకు కోచింగ్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఈ పెరుగుదలకు కారణమని అధికారులు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో JEE, NEET, ECET, CLAT వంటి పరీక్షలకు కార్పొరేట్ సంస్థలతో కలిసి కోచింగ్ ఇస్తున్నారు. డైరెక్టర్ కృష్ణ ఆదిత్య చేపట్టిన సంస్కరణలు ఈ ఫలితాలకు దారితీశాయి.

Advertisement