Advertisement

కర్నూలు జిల్లాలో భూకంపం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం హఠాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కర్నూలు నగరం సహా ఆదోని, దాని పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇళ్లలోని పాత్రలు, వస్తువులు భయంకరమైన శబ్దాలతో కదిలిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక జనం భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు, ఖాళీ ప్రదేశాల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైనట్లు భూకంపశాఖ అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. భూ అంతర్భాగంలో జరిగిన చిన్నపాటి సర్దుబాట్ల వల్లే ప్రకంపనలు వచ్చాయని, తీవ్రత తక్కువగా ఉండటంతో ఆస్తి, ప్రాణ నష్టాలు తప్పాయని వెల్లడించారు. స్వల్పంగానే కంపించినప్పటికీ వచ్చిన విచిత్ర శబ్దాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. పోలీసులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement