మన పత్రిక, న్యూఢిల్లీ: DA hike for central government employees – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డియర్నెస్ అలవెన్స్ (DA – కరవు భత్యం) పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఏను మరో 2 శాతం పెంచుతూ శనివారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా హోలీ, దీపావళి సమయాల్లో వచ్చే ఈ ప్రకటన కాస్త ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తాజా నిర్ణయంతో కేంద్రం వారికి ఊరటనిచ్చింది.
ఈ పెంపు 2026 జనవరి 1వ తేదీ నుంచే అమల్లోకి రానుంది. గతేడాది అక్టోబర్లో కేంద్రం డీఏను 3 శాతం (55% నుంచి 58%కి) పెంచింది. తాజా 2% పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బేసిక్ పేలో 60 శాతానికి చేరింది.
కొత్త వేతన సంఘంపై డిమాండ్లు: ఒకవైపు డీఏ పెంపు జరిగినప్పటికీ, పెరుగుతున్న ధరల నేపథ్యంలో 8వ వేతన సంఘాన్ని తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం రూ.18,000గా ఉన్న కనీస వేతనాన్ని, 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా రూ.69,000కు పెంచాలని వారు ఇప్పటికే కేంద్రానికి నివేదిక సమర్పించారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే:
- కనీస బేసిక్ పే: రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలి (3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్).
- వార్షిక ఇంక్రిమెంట్: ప్రతి ఏడాది ఇచ్చే ఇంక్రిమెంట్ను 6 శాతానికి పెంచాలి.
- HRA (ఇంటి అద్దె భత్యం): కనీసం 30 శాతంగా నిర్ణయించాలి.
- పెన్షన్: పాత పెన్షన్ స్కీమ్ (OPS) విధానాన్ని తిరిగి తీసుకురావాలి.
