మన పత్రిక వెబ్డెస్క్: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు భారత మద్యం ప్రియులపైనా పడనుంది. గ్యాస్ కొరత కారణంగా ఉత్పత్తి ఖర్చులు అమాంతం పెరగడంతో దేశంలో త్వరలో బీర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని, ధరలు కూడా భారీగా పెరగనున్నాయని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) హెచ్చరించింది.
భారతదేశం తన సహజ వాయువు అవసరాల కోసం ప్రధానంగా మధ్యప్రాచ్యంపై ఆధారపడుతుంది. దేశానికి అవసరమైన గ్యాస్లో సుమారు 40 శాతం ఖతార్ నుంచే దిగుమతి అవుతుంది. అయితే, గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడుల కారణంగా ఖతార్ ఎగుమతులకు అంతరాయం ఏర్పడి, భారత తయారీ రంగంలో గ్యాస్ కొరత తీవ్రమైంది.
గ్యాస్ కొరత వల్ల ఫర్నేస్ల నిర్వహణ భారం కావడంతో గాజు సీసాల (గ్లాస్ బాటిల్స్) ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. కార్టన్ బాక్సుల ధరలు రెట్టింపయ్యాయి. బీర్ల క్యాన్ల తయారీకి అవసరమైన అల్యూమినియం సరఫరాలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ లాంటి తయారీ కేంద్రాల్లోని గ్లాస్ ఫ్యాక్టరీలు ఇప్పటికే తమ ఉత్పత్తిని 40 శాతం మేర తగ్గించాయి.
హెనెకెన్ (Heineken), కార్ల్స్బర్గ్, ఏబీ ఇన్బెవ్ లాంటి దిగ్గజ బ్రాండ్లకు ప్రాతినిధ్యం వహించే బ్రూవర్స్ అసోసియేషన్.. బీర్ల ధరలను 12 నుంచి 15 శాతం వరకు పెంచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. ధరల పెంపునకు అనుమతించని రాష్ట్రాల్లో బీర్ల సరఫరాను నిలబెట్టుకోవడం కష్టమని అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి స్పష్టం చేశారు. వేసవి కాలంలో బీర్ల విక్రయాలు జోరుగా సాగే సమయంలో ఈ పరిణామం పరిశ్రమను కలవరపెడుతోంది. మరోవైపు, ఈ సంక్షోభం ప్లాస్టిక్ బాటిళ్ల తయారీపైనా పడటంతో దేశంలో బాటిల్ వాటర్ ధరలు కూడా 11 శాతం మేర పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ విషయంపై ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి :
- బ్రిటన్కు యుద్ధ భయం: 5 ఏళ్లలో యుద్ధం తప్పదంటున్న 40 శాతం ప్రజలు
- మధ్యప్రాచ్యంలో భగ్గుమన్న ఉద్రిక్తతలు: టెల్ అవీవ్పై ఇరాన్ దాడులు.. లెబనాన్పై ఇజ్రాయెల్ పట్టు
- కోనరావుపేట పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
