మన పత్రిక వెబ్డెస్క్, ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ నటి టీనా శ్రావ్య చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా భక్తులు తమ బరువుకు సరిపడా బంగారాన్ని (బెల్లం) అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. దీనిని తులాభారం అంటారు. అయితే, హీరోయిన్ టీనా శ్రావ్య ఏకంగా తన పెంపుడు కుక్కకు తులాభారం వేయించి అమ్మవార్లకు బంగారం సమర్పించడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. కుక్కను త్రాసులో కూర్చోబెట్టి తూకం వేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పవిత్రమైన జాతర సంప్రదాయాలను, భక్తుల మనోభావాలను ఆమె దెబ్బతీశారంటూ పలువురు మండిపడ్డారు.
ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో టీనా శ్రావ్య స్పందిస్తూ క్షమాపణలు కోరారు. ‘కమిటీ కుర్రోళ్లు’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తన పెంపుడు కుక్కకు 12 ఏళ్లు అని, ఇటీవల దానికి ట్యూమర్ సర్జరీ జరిగిందని తెలిపారు. అది కోలుకొని మళ్ళీ నడవాలని అమ్మవార్లను మొక్కుకున్నానని, ఆ మొక్కు తీర్చుకునే క్రమంలోనే ప్రేమతో, భక్తితో తులాభారం వేశానని వివరణ ఇచ్చారు. అయితే గిరిజన ఆచారాల ప్రకారం, మేడారం సంప్రదాయం ప్రకారం అది తప్పని తెలిసిందని, తన చర్య వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని, ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
