మన పత్రిక, హాలియా: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ హెచ్చరించారు. మంగళవారం హాలియా పట్టణంలో మైనర్ డ్రైవింగ్ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు నడుపుతున్న 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ.. సరైన అవగాహన లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు రూ. 25,000 వరకు భారీ జరిమానా విధించడంతో పాటు, ఆ వాహన రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వొద్దని, వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎస్ఐ సూచించారు. కాగా, పట్టుబడిన మైనర్లను పోలీస్ స్టేషన్కు తరలించి, వారికి ఎస్ఐ ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు.
