Advertisement

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే

మన పత్రిక, తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 జూన్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా ఆన్‌లైన్ విడుదల తేదీలను మంగళవారం సవివరంగా వెల్లడించింది. సుప్రభాతం, తోమాల, అర్చన తదితర ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ తదితర టికెట్లను మార్చి 21న ఉదయం 10 గంటలకు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను విడుదల చేయనున్నారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు జారీ చేస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.

Advertisement

భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలోని గదుల కోటాను జారీ చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ విషయంపై అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement