WhatsApp
Advertisement

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికల మధ్య సంచలన ప్రకటన!

మన పత్రిక వెబ్​డెస్క్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు, ఇజ్రాయెల్-అమెరికా దాడుల ఉద్రిక్తతల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ నూతన (మూడవ) సుప్రీం లీడర్‌గా దివంగత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడైన 56 ఏళ్ల సయ్యద్ మొజ్తాబా హొస్సేని ఖమేనీని (MOJTABA KHAMENEI) ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఎంపిక ఎలా జరిగిందంటే.. 88 మంది ఇస్లామిక్ మత గురువులతో కూడిన ఇరాన్ ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ (Assembly of Experts) ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. కొందరు సభ్యులు వారసత్వ నాయకత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ.. మెజారిటీ సభ్యులు మొజ్తాబా వైపు మొగ్గుచూపారు. అయితే, ఆయన ఎప్పటి నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

లండన్‌లో వేల కోట్ల ఆస్తులు.. అక్రమ చమురు వ్యాపారం? కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తులున్నట్లు తెలుస్తోంది. కేవలం లండన్‌లోనే సుమారు రూ. 2,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా కెన్సింగ్‌టన్ ప్యాలెస్‌లో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్లు ఆయన పేరిట ఉన్నట్లు సమాచారం. అక్రమ చమురు విక్రయాల ద్వారా 2014 నుంచి ఆయన ఈ సంపదను కూడబెట్టినట్లు అంతర్జాతీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అమెరికా, ఇజ్రాయెల్ సీరియస్.. ఆస్తులపై నిఘా! మొజ్తాబా నియామకాన్ని అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునేముందు తమ అనుమతి తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. అలాగే, కొత్త లీడర్ ఎవరైనా సరే మట్టుబెడతామని ఇజ్రాయెల్ బహిరంగంగానే ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లండన్‌లోని మొజ్తాబా ఆస్తులపై ఇజ్రాయెల్, అమెరికా నిఘా వర్గాలు ఫోకస్ పెట్టినట్లు, ఆ ఆస్తులకు భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement