మన పత్రిక వెబ్డెస్క్, దుబాయ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) శనివారం తన విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
విమానాశ్రయ పరిసరాల్లో గాలిలోనే ఓ అనుమానాస్పద వస్తువును (క్షిపణి/డ్రోన్) అడ్డుకోవడంతో దాని శకలాలు కిందపడ్డాయి. మొదట ఇది పేలుడుగా భావించినప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని దుబాయ్ మీడియా ఆఫీస్ స్పష్టం చేసింది. అయితే, ప్రయాణికులు, ఎయిర్లైన్ సిబ్బంది భద్రత దృష్ట్యా విమానాశ్రయంలో సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది.
ఎమిరేట్స్ విమానాలు రద్దు: మరోవైపు, మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ‘ఎమిరేట్స్’ సైతం తదుపరి ప్రకటన వచ్చే వరకు దుబాయ్కి రాకపోకలు సాగించే తమ విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దయచేసి ప్రయాణికులు ఎవరూ ఎయిర్పోర్ట్కు రావొద్దని, అప్డేట్స్ కోసం వేచి ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.
గత శనివారం అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం మొదలైనప్పుడు దుబాయ్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో నలుగురు సిబ్బంది గాయపడటంతో పాటు ఓ టెర్మినల్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచి పాక్షికంగా సేవలు ప్రారంభమైనప్పటికీ, తాజా పరిణామాలతో మళ్లీ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. విమానాశ్రయం వద్ద ఫ్లైట్రాడార్ వెబ్సైట్ డేటా ప్రకారం.. పలు విమానాలు ల్యాండ్ కాలేక గాల్లోనే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- అబుదాబి దాడుల్లో సిరిసిల్ల యువకుడికి గాయాలు.. ఆందోళనలో కన్నవారు!
- పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ విషయంలో తగ్గేదే లేదన్న అధ్యక్షుడు!
- ఎస్సెస్సీ జేఈ టైర్-1 స్కోర్ కార్డ్.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!
- హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. లోన్ల ఈఎంఐల తగ్గింపు, ఎఫ్డీలపై వడ్డీ పెంపు!
- తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డులు 2025 ప్రకటన.. | Gaddar Film Awards 2025 Announced
