మన పత్రిక వెబ్డెస్క్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సెంటర్లో శుక్రవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిత్యంలాగే పరిసరాల పరిశుభ్రతలో భాగంగా వీధులను శుభ్రం చేస్తుండగా, అటుగా వచ్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా వారితో కలిసిపోయారు. కారు దిగిన ఆయన నేరుగా చేతిలోకి చీపురు తీసుకుని రోడ్ల వెంట ఉన్న చెత్తను తొలగిస్తూ శుభ్రత పనుల్లో భాగస్వాములయ్యారు. ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి స్వయంగా రోడ్డెక్కి పారిశుధ్య పనులు చేయడం స్థానికులను, కార్మికులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు గ్రామాల పరిశుభ్రత కోసం చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ఎండనక, వాననక కష్టపడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని అన్నారు. ప్రభుత్వం తరఫున కార్మికులకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని కార్మికులకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
