Advertisement

TG News: ఉద్యోగులకు డీఏ మంజూరు.. జిల్లాల మార్పుపై కమిషన్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరువు భత్యం (DA) ఫైలుపై సంతకం చేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల స్వరూపం మారబోతోందంటూ మరో కీలక ప్రకటన చేశారు. టీజీవో (TGO) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ సంచలన విషయాలను వెల్లడించారు.

ఉద్యోగులకు వరాలు – డీఏ మంజూరు ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో డీఏ ఫైల్ మీద సంతకం చేశానని సీఎం తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.227 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Advertisement
  • రూ.1 కోటి బీమా: ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
  • జీతాలు ఆన్ టైమ్: గతంలో జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని గుర్తుచేశారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కమిషన్ గత ప్రభుత్వం తమ ఇష్టారాజ్యంగా జిల్లాలను, మండలాలను విభజించిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనిపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు, వినతులు వస్తున్న నేపథ్యంలో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించారు.

  • జ్యుడీషియల్ కమిషన్: జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ కోసం త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను నియమిస్తామని ప్రకటించారు.
  • ప్రజాభిప్రాయం: ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల నుంచి సూచనలు తీసుకుంటుంది. బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీలతో చర్చించి కొత్త జిల్లాల/మండలాల సరిహద్దులపై నిర్ణయం తీసుకుంటారు.

ఫామ్ హౌస్ రాజకీయాలు.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టిందని, నెలకు రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుంటే.. రూ.22 వేల కోట్లు అప్పులు కట్టాల్సి వస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉంటూ మారీచులను పంపుతున్నాడు” అంటూ పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

Advertisement