Advertisement

సంక్రాంతికి ముందు ఈ ఆలయంలో వింత ఆచారం.. ఆడవారికి నో ఎంట్రీ

మన పత్రిక వెబ్​డెస్క్, అన్నమయ్య జిల్లా: సాధారణంగా పండుగలు అంటేనే ఆడవారు పిండివంటలు చేయడం, ఇంటిల్లిపాదీ ఆనందంగా గడపడం. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో మాత్రం సంక్రాంతికి ముందు ఒక వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ జరిగే పండుగలో మహిళలకు ప్రవేశమే ఉండదు. వంట చేయడం నుంచి నైవేద్యం సమర్పించడం వరకు అన్నీ మగవారే దగ్గరుండి చూసుకుంటారు.

ఎక్కడ? ఏంటి ఆచారం? రైల్వేకోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని శ్రీ సంజీవరాయ (ఆంజనేయ స్వామి) ఆలయంలో ఈ శతాబ్దాల నాటి ఆచారం ఉంది. ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు ఇక్కడ ‘మగవారి పొంగళ్లు’ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Advertisement

ఈ పండుగ ప్రత్యేకతలు:

  • మగవారే వంట: విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మగవారు ఈ పండుగ కోసం ప్రత్యేకంగా సొంతూరికి వస్తారు. తమ ఇళ్ల నుంచి వంట సామాగ్రి తెచ్చుకుని, ఆలయ ఆవరణలోనే పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యం పెడతారు.
  • నో ఎంట్రీ: ఈ ఒక్కరోజు మాత్రం మహిళలకు ఆలయం లోపలికి ప్రవేశం ఉండదు. కనీసం ప్రసాదాన్ని (పొంగలి) తినడానికి కూడా వీలులేదు. వారు ఆలయ ప్రాంగణం బయట నుంచే స్వామివారిని దర్శించుకుంటారు.

చరిత్ర ఏం చెబుతోంది? స్థల పురాణం ప్రకారం.. శతాబ్దాల క్రితం ఒక సాధువు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కేవలం పురుషుల నుంచి మాత్రమే ఆహారం స్వీకరించారట. ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆలయానికి గోపురం లేదా గర్భగుడి కట్టవద్దని, కొన్ని నియమాలు పాటించాలని ఆదేశించారట. అందుకే నేటికీ అక్కడ ప్రహరీ గోడలు మాత్రమే ఉంటాయి. మరో కథనం ప్రకారం.. కరువు కాటకాల నుంచి గ్రామాన్ని రక్షించుకోవడానికి ఈ ఆచారం మొదలైందని, ఇది పాటిస్తే దుష్టశక్తులు, అనారోగ్య సమస్యలు దరిచేరవని గ్రామస్తుల నమ్మకం.

Advertisement