మన పత్రిక వెబ్డెస్క్, నల్గొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉండి, జీవిత ఖైదు అనుభవిస్తున్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్కు తెలంగాణ హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
దీనిని విచారించిన హైకోర్టు.. శ్రవణ్ కుమార్ వయసును, ఆయన ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని ఊరటనిచ్చింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో నల్గొండ కోర్టు మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.
కేసు పూర్వాపరాలు.. 2018లో అమృత వర్షిణి, ప్రణయ్ కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేక అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్ను హత్య చేయించారు. రూ. కోటి సుపారీతో బీహార్కు చెందిన సుభాష్ శర్మ అనే హంతకుడిని ఏర్పాటు చేశారు. 2018 సెప్టెంబర్ నెలలో గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రి నుంచి తీసుకువస్తుండగా, ఆమె కళ్లెదుటే ప్రణయ్ను గొడ్డలితో నరికి చంపారు. ఈ దారుణ ఘటన సిసిటీవీలో రికార్డై దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. విచారణ దశలోనే 2020లో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
