Advertisement

Sankranti: చర్లపల్లి – వైజాగ్ మధ్య ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్ ఇవే

మన పత్రిక వెబ్​డెస్క్, సికింద్రాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు గాను చర్లపల్లి – విశాఖపట్నం మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు రూట్లలో స్పెషల్ సర్వీసులను ప్రకటించిన రైల్వే శాఖ, తాజాగా ఈ రెండు నగరాల మధ్య అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

రైలు సమయాలు – తేదీలు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన ప్రకారం, జనవరి 18న విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు (నెంబర్ 08513) బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 11 గంటలకు విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో జనవరి 19న చర్లపల్లి నుంచి విశాఖపట్నంకు (నెంబర్ 08514) ప్రత్యేక రైలు నడుస్తుంది. ఇది మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరునాడు ఉదయం 7 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

Advertisement

ఆగే స్టేషన్లు ఇవే ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామల్ కోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

హైటెక్ సిటీ, చర్లపల్లిలో అదనపు హాల్ట్‌లు మరోవైపు, నగరవాసుల సౌకర్యార్థం జనవరి 7 నుంచి 20 వరకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి వెళ్లే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లు హైటెక్ సిటీలో ఆగుతాయి. అలాగే సింహపురి, గౌతమి, గోదావరి, గరీబ్‌రథ్ వంటి 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో హాల్ట్ ఉంటుంది.

Advertisement