మన పత్రిక వెబ్డెస్క్, యాదాద్రి: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్టలో మహిళా క్యాంటీన్లను (Women’s Canteens) ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. అసెంబ్లీ వేదికగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. నిత్యం వేలాదిగా వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా, గుట్ట పరిసరాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే స్థానిక మహిళలు ఆర్థికంగా బలపడతారని, వారికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు పెద్దపీట వేశామని, వారి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఐలయ్య స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపు, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలతో మహిళా సాధికారత సాధ్యమైందన్నారు. ఈ సంక్షేమ పథకాల వల్లే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని, 70 శాతం మెజార్టీ సాధించడంలో వారి పాత్ర కీలకమని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని తమ సొంత కుటుంబంగా మహిళలు భావిస్తున్నారని తెలిపారు.
ఇక ఇందిరమ్మ చీరల పంపిణీపై కూడా ఆయన కీలక సూచనలు చేశారు. కేవలం మహిళా సంఘాలకే కాకుండా, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ చీరలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం రూ.60 చీరలతో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, నేతన్నలు నేసిన నాణ్యమైన చీరలను తమ ప్రభుత్వం అందించనుందని చెప్పారు. రేవంతన్న పంపిస్తున్న చీరలను తీసుకునేందుకు మహిళలు సంతోషంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
