Advertisement

మా వాటా ఇవ్వాల్సిందే.. లేదంటే జూరాల నుంచే నీళ్లు లిఫ్ట్ చేస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడేదే లేదని, అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా జరిగిన “నీళ్లు-నిజాలు” స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రానికి, కేంద్రానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

జూరాల నుంచే నీళ్లు తీసుకుంటాం: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) సంబంధించి తొలి విడతలో 45 టీఎంసీలు, రెండో విడతలో 45 టీఎంసీలు.. వెరసి మొత్తం 90 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాల్సిందేనని సీఎం డిమాండ్ చేశారు. ఒకవేళ అలా జరగకపోతే, జూరాల ప్రాజెక్టు నుంచే నేరుగా రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని తరలిస్తామని, ఎవరొచ్చి అడ్డుకుంటారో చూస్తానంటూ సవాల్ విసిరారు.

Advertisement

కేసీఆర్‌పై ఫైర్ – పాపం ఎవరిది?: గత ప్రభుత్వ తప్పిదాలను సీఎం ఎండగట్టారు.

  • వాటాల్లో అన్యాయం: కృష్ణా బేసిన్ పరీవాహక ప్రాంతం తెలంగాణలో 71% ఉందని, న్యాయంగా 811 టీఎంసీల్లో మనకు 555 టీఎంసీలు రావాలని అన్నారు. కానీ గత పాలకులు (కేసీఆర్) కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకొని, ఏపీకి 512 టీఎంసీలు దక్కేలా సంతకం చేశారని మండిపడ్డారు.
  • ప్రాజెక్టు డిజైన్ మార్పు: పాలమూరు-రంగారెడ్డి సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్లే ఖర్చు తడిసి మోపెడైందని విమర్శించారు. రూ.32 వేల కోట్ల అంచనా వ్యయం రూ.1 లక్ష కోట్లకు చేరిందన్నారు. శ్రీశైలం వద్ద నీటి లభ్యత లేకపోయినా అక్కడికి మార్చి, పంపుల సంఖ్య పెంచారన్నారు.

తాగునీటి ప్రాజెక్టా?: రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టి, చివరకు పర్యావరణ అనుమతుల కోసం సుప్రీంకోర్టులో.. “ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు, కేవలం 7.15 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టు మాత్రమే” అని గత ప్రభుత్వం అఫిడవిట్ వేయడం సిగ్గుచేటని రేవంత్ ధ్వజమెత్తారు.

Advertisement