Advertisement

కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.3000 కోట్ల నిధులు విడుదల? మాజీ సర్పంచుల్లో ఆశలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు పట్టిన గ్రహణం వీడనుంది. ఎంతోకాలంగా నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం.

రూ.3000 కోట్లు పెండింగ్: గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు రూ.3000 కోట్ల నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో, పెండింగ్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. రెండేళ్ల క్రితం ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలను (Utilization Certificates) వెంటనే సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది.

Advertisement

అధికారుల కసరత్తు: కేంద్రం అడిగిన సమాచారాన్ని అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ వివరాలు పంపిస్తే వెంటనే నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మాజీ సర్పంచుల్లో చిగురిస్తున్న ఆశలు: మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో సొంత డబ్బులతో గ్రామాభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పాలకవర్గాలు రావడం, కేంద్రం నుంచి నిధుల విడుదలకు మార్గం సుగమం కావడంతో తమ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుందనే ఆశతో ఉన్నారు.

Advertisement