Advertisement

మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి: రేపే బిగ్ మ్యాచ్, వివరాలివే

మన పత్రిక, వెబ్​డెస్క్: ఒకప్పుడు ఫుట్‌బాల్‌కు అడ్డాగా ఉన్న హైదరాబాద్‌లో మళ్లీ సాకర్ మానియా కనిపిస్తోంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ రాకతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు సాగనున్న మెస్సీ భారత పర్యటనలో భాగంగా, రేపు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. కోల్‌కతాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ ప్రమోటర్ శతద్రు దత్తా ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ టూర్ జరుగుతోంది. గతంలో పీలే, మారడోనా వంటి దిగ్గజాలను భారత్‌కు రప్పించిన శతద్రు, ఈసారి మెస్సీ పర్యటనను పర్యవేక్షిస్తున్నారు.

మ్యాచ్ వివరాలు ఇవే.. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ‘సింగరేణి ఆర్ఆర్-9’ (Singareni RR9) జట్టు మరియు ‘అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్’ (Aparna Messi All Stars) జట్లు తలపడనున్నాయి. సింగరేణి ఆర్ఆర్-9 జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సింగరేణి సంస్థ దీనికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అపర్ణ మెస్సీ జట్టుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ స్పాన్సర్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో మెస్సీ దాదాపు 20 నిమిషాల పాటు మైదానంలో సందడి చేయనున్నారు. ఈ మ్యాచ్‌ను ‘సోనీ లివ్’ (Sony LIV) యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Advertisement

ప్రభుత్వ పాత్ర – వ్యూహం మెస్సీ పర్యటన పూర్తిగా ప్రైవేట్ అయినప్పటికీ, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ప్రభుత్వం దీనిని ఒక అవకాశంగా మలుచుకుంది. గతంలో ఫార్ములా రేసింగ్ కోసం భారీగా ప్రజాధనం ఖర్చు చేశారనే విమర్శల నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. మెస్సీకి నేరుగా ఫీజులు చెల్లించకుండా, కేవలం భద్రత, లాజిస్టిక్స్, స్టేడియం అద్దె వంటి మౌలిక సదుపాయాలను మాత్రమే ప్రభుత్వం సమకూరుస్తోంది.

హైదరాబాద్ శివార్లలోని ‘ఫ్యూచర్ సిటీ’లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో మెస్సీ వంటి అంతర్జాతీయ క్రీడాకారుడి రాక.. భవిష్యత్తులో పెట్టుబడులను, క్రీడాభివృద్ధిని ఆకర్షించడానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement