Advertisement

TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!

మన పత్రిక, వెబ్​డెస్క్: వరంగల్, హనుమకొండ నగరాల్లోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్​డీఆర్​ఎఫ్ సిబ్బందిని వెంటనే తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు.

అత్యవసర ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హైదరాబాద్ (హైడ్రా) సిబ్బందిని, వారి వద్దనున్న వరద సహాయక సామగ్రిని వినియోగించాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఇళ్ల కప్పులపై, బంగ్లాల్లో చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా అవసరమైన ఆహారం, మంచినీటిని సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు.

Advertisement

ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా, లోటుపాట్లకు తావివ్వకుండా అప్రమత్తతతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు గట్టిగా చెప్పారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈరోజు (గురువారం) తలపెట్టిన వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్న ముఖ్యమంత్రి, శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

Advertisement