Advertisement

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కుంకీ ఏనుగులకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం

మన పత్రిక, మంగళగిరి: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంట పొలాలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను అదుపు చేసేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన ‘జయంత్’, ‘అభిమన్యు’ అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి Pawan Kalyan స్వాగతం పలికారు.

కుంకీ ఏనుగులకు పూలమాలలు వేసి, స్వయంగా చెరుకు గెడలను ఆహారంగా తినిపించిన Pawan Kalyan, వాటికి వీడ్కోలు పలికారు. ఈ రెండు ఏనుగులను మొదట పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించనున్నారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నియంత్రించేలా అటవీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జయంత్, అభిమన్యులకు గతంలో కూడా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉండటంతో అధికారులు వీటిని రంగంలోకి దించారు.

Advertisement

ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులకు Pawan Kalyan పలు సూచనలు చేశారు. ఒడిశా సరిహద్దుల నుంచి ఏనుగులు రాష్ట్రంలోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నందున, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని కోరారు. అవసరమైతే ఒడిశా నుంచి మరికొన్ని కుంకీ ఏనుగులను రప్పించి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. జనవాసాల్లోకి వచ్చిన ఏనుగులను వీలైనంత త్వరగా అడవుల్లోకి మళ్లించేలా చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

Advertisement