Advertisement

విద్యార్థులను డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బెదిరించిన ముంబై పోలీస్ అధికారిపై చర్యలు

మన పత్రిక, ముంబై: నీట్ పేపర్ లీక్‌పై నిరసన తెలుపుతున్న విద్యార్థులను మళ్లీ ఆందోళనల్లో కనిపిస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బెదిరించిన ముంబై పోలీస్ అధికారి పవన్ సంగాలేపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సదరు అధికారి బెదిరింపులకు పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముంబై పోలీస్ యంత్రాంగం దీనిపై విచారణకు ఆదేశించింది. సయాన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న పవన్ సంగాలేను ఆ స్థానం నుంచి తొలగించి మోటార్ వెహికల్ విభాగానికి బదిలీ చేశారు.

పోలీస్ వాహనంలో నిర్బంధించిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన పవన్ సంగాలే, మళ్లీ నిరసనల్లో కనిపిస్తే జేబుల్లో 50 గ్రాముల డ్రగ్స్ పౌడర్ వేసి జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించారు. ఈ సంభాషణను వాహనంలో ఉన్న ఒక విద్యార్థి రహస్యంగా వీడియో తీశాడు. ఈ ఘటనపై ముంబై కాంగ్రెస్ స్పందిస్తూ, ఇది విద్యార్థులను భయపెట్టడమే కాకుండా ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని పేర్కొంది.

Advertisement
Advertisement