తల్లికి వందనం డబ్బులు రానివారు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో Thalliki Vandanam Scheme నిధులను జమ చేస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఉన్న అర్హులైన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందుతుంది. అయితే అర్హతలు ఉండి కూడా ఖాతాల్లో డబ్బులు జమకాని వారు ఆందోళన చెందకుండా గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఈ పథకానికి రేషన్ కార్డు కలిగి ఉండటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000 ఆదాయం దాటకూడదు. ఫోర్ వీలర్లు (ట్రాక్టర్లు, ఆటోలు మినహా) ఉండరాదు. అలాగే విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటకూడదు, పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులుగా ఉంటారు.

సచివాలయంలో ఫిర్యాదు చేసే విధానం

అర్హత ఉండి నిధులు రానివారు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్‌ను కలవాలి. అక్కడ ప్రభుత్వం ప్రదర్శించిన జాబితాలో పేరు లేకపోతే గ్రీవెన్స్ విధానం ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. దీనికోసం తల్లి లేదా విద్యార్థి ఆధార్ కార్డు, చైల్డ్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా విద్యార్థి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

అనర్హతకు కారణమైన అంశాన్ని తెలుసుకుని, దానికి సంబంధించిన సరైన ఆధార పత్రాలను జత చేయాలి. ఆ తర్వాత ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి దరఖాస్తును సమర్పించాలి. అధికారులు ఈ ఫిర్యాదులను పరిశీలించి అర్హులకు త్వరగా నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటారు.