Advertisement

ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

మన పత్రిక: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం, రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం మరియు తీవ్ర వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు కాలేదని, 30 నుంచి 35 శాతానికి మించి వర్షపాతం నమోదు కాలేదని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాగునీరు, సాగునీరు మరియు విద్యుత్ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. వర్షాభావ పరిస్థితులపై పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపాలని కోరాలని మంత్రిమండలి తీర్మానించింది.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 1-800-123-7157 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. ఇది ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా ఉండేలా చూడాలని కేబినెట్ ఆదేశించింది. రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించిన ప్రభుత్వం, ఈ నెల 20న జిల్లాల వారీగా సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని నిర్ణయించింది.

Advertisement

ధరణి పోర్టల్ విచారణ

ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. 2020 అక్టోబర్ 29న పోర్టల్ ప్రారంభమైనప్పటి నుండి జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు మరియు ప్రభుత్వ భూముల బదలాయింపులతో సహా అన్ని అనుమానాస్పద లావాదేవీలను ఈ బృందం లోతుగా పరిశీలిస్తుంది. టెండర్ ప్రక్రియ నుండి ఇటీవల వచ్చిన ఆరోపణల వరకు అన్ని అంశాలను విచారణ పరిధిలోకి తీసుకువచ్చారు.

చట్ట సవరణలకు ఆమోదం

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019ని సవరించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, గ్రామ పంచాయతీ నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణలు చేసేందుకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.

Advertisement