మన పత్రిక, శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లాలో ఒక కుటుంబంలో జరిగిన తీవ్ర విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా వసంత (35) అనే మహిళ తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి, తాను కూడా అదే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం రాత్రి శంకర్పల్లి మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన సుధాకర్, వసంత దంపతులు ఉపాధి కోసం వచ్చి కొత్తపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి 15 ఏళ్ల కుమార్తె మరియు 10 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ పరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన వసంత, రాత్రి సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకుని ఊరి చివర ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది.
బాలుడి ప్రాణాపాయం తప్పింది
తల్లి పిల్లలను బావిలోకి తోసేసిన సమయంలో, అదృష్టవశాత్తూ పదేళ్ల కుమారుడు బావిలో ఉన్న ఒక చెట్టు కొమ్మకు చిక్కుకున్నాడు. ఆ కొమ్మను గట్టిగా పట్టుకుని ఏడుస్తుండటంతో బాలుడు ప్రాణాలతో బయటపడగలిగాడు. వసంతతో పాటు 15 ఏళ్ల కుమార్తె బావిలో మునిగిపోయి మరణించారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
