మన పత్రిక, గురుగ్రామ్: గురుగ్రామ్లోని సెక్టార్ 67లో ఉన్న అన్సల్ వర్సాలియా సొసైటీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన థార్ వాహనాన్ని రివర్స్ చేస్తున్న క్రమంలో ఒక మహిళ అటుగా ఉన్న గృహ కార్మికురాలిని ఢీకొట్టింది. ఉత్తరప్రదేశ్లోని మహోబాకు చెందిన 57 ఏళ్ల గుడ్డి అనే మహిళ పని ముగించుకుని పార్కింగ్ ప్రాంతంలో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన మహిళా డ్రైవర్, గాయపడిన గుడ్డిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అయితే వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఆ తర్వాత నిందితురాలు మృతదేహాన్ని తిరిగి తన వాహనంలోనే తీసుకువచ్చి, ప్రమాదం జరిగిన అదే పార్కింగ్ ప్రాంతంలో పడేసి వెళ్ళిపోయింది. ఈ ఘటనపై బాధితురాలి మేనల్లుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న సెక్టార్ 65 పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైవర్ ఇంటి ముందు నిరసన తెలిపారు. నిందితురాలు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని తిరిగి తెచ్చి పడేయడంపై బాధితురాలి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
