Advertisement

ధార్వాడ్‌లో దారుణం: భర్తను చంపి, కుమారుడిపై దాడి చేసిన డాక్టర్

మన పత్రిక, ధార్వాడ్: కర్ణాటకలోని ధార్వాడ్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. డాక్టర్లుగా పనిచేస్తున్న కిరణ్ హోనన్నవర్ మరియు ప్రియాంక దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త కిరణ్ హత్యకు గురయ్యారు. అనస్థీషియా స్పెషలిస్ట్ అయిన కిరణ్, కంటి వైద్యురాలైన ప్రియాంకలకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.

గత రెండు రోజులుగా కిరణ్‌ను సంప్రదించేందుకు బంధువులు ప్రయత్నించగా, ప్రియాంక పొంతన లేని సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన బంధువులు వారి నివాసానికి వెళ్లి చూడగా, కిరణ్, బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నారు. అక్కడే ప్రియాంక ఏమీ తెలియనట్లుగా ఫోన్ చూస్తూ కూర్చోవడం గమనార్హం. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

పోలీసుల దర్యాప్తు

ఆసుపత్రికి తరలించగా, అప్పటికే కిరణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలపాలైన ఎనిమిదేళ్ల కుమారుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, విచారణలో అస్పష్టంగా మాట్లాడుతోందని పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Advertisement