మన పత్రిక, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై తీవ్రంగా పడుతోంది. సోమవారం లీటరు పెట్రోల్పై రూ. 2.61, డీజిల్పై రూ. 2.71 చొప్పున ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచాయి. ఈ తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటి రూ. 102.12 కి చేరింది. అక్కడ డీజిల్ ధర లీటరు రూ. 95.20 వద్ద విక్రయించబడుతోంది.
గడిచిన రెండు వారాల లోపే పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరగడం గమనార్హం. మే 15 నుంచి ఇప్పటివరకు మొత్తంగా పెట్రోల్పై రూ. 7.35, డీజిల్పై రూ. 7.53 వరకు భారం పడింది. ఇరాన్-ఒమన్ మధ్య ఉండే అంతర్జాతీయ చమురు రవాణా మార్గమైన ‘హార్ముజ్ జలసంధి’ లో ఏర్పడిన ఆటంకాలే ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచ సరఫరాలో ఐదో వంతు ముడి చమురు ఈ ఇరుకైన జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. అమెరికా-ఇరాన్ ఘర్షణల వల్ల వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో మార్కెట్లో చమురు కొరత భయాలు పెరిగి, అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలను భారీగా పెంచేసింది.
లాభాల్లో ఉన్నా తప్పని వడ్డన ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 77,000 కోట్ల భారీ నికర లాభాలను ఆర్జించినప్పటికీ, పాత నష్టాలను పూడ్చుకునేందుకు ధరలను పెంచుతున్నట్లు సమర్థించుకుంటున్నాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిన్న తరుణంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని పెట్రోలియం మంత్రి హార్దీప్ సింగ్ పూరి ఇదివరకే సూచనప్రాయంగా తెలిపారు. దేశ ప్రజలు కార్పూలింగ్, ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించి ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
శాంతి చర్చలతో కొంత ఊరట మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల పురోగతిపై వస్తున్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్కు కొంత ఊరటనిచ్చాయి. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. సోమవారం ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ దాదాపు 5.2 శాతం పడిపోయి బ్యారెల్కు 98 డాలర్ల దిగువకు చేరింది. ఈ చర్చలు సఫలమైతేనే రానున్న రోజుల్లో దేశీయంగా చమురు మార్కెట్ శాంతించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
- సైబర్ మోసగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు.. డెలివరీ బాయ్ అరెస్ట్
