Advertisement

శ్రీకాకుళం జిల్లా జైల్లో సీదిరి అప్పలరాజును జగన్ కలుసుకోనున్నారు

మన పత్రిక, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30వ తేదీ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అంపోలు జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజును ఆయన ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు. అప్పలరాజుతో సమావేశం పూర్తయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులను కూడా జగన్ కలవనున్నట్లు సమాచారం.

ఇటీవల చోటుచేసుకున్న ఒక బైక్ ప్రమాద ఘటనలో (అప్పలరాజు కుమారుడికి సంబంధించిన కేసు) ఒక వ్యక్తి మృతి చెందగా, దర్యాప్తును పక్కదోవ పట్టించారనే ఆరోపణలతో సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు నమోదుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి, అప్పలరాజును ఏ3గా చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.

Advertisement

ఈ పర్యటన ద్వారా సీదిరి అప్పలరాజు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేయడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement