Advertisement

సోషల్ మీడియాలో జగన్ పాత ప్రకటనల కలకలం

మన పత్రిక: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వివిధ అంశాలపై చేసిన ప్రకటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమరావతి రాజధాని, భోగాపురం విమానాశ్రయం, కియా కార్ల పరిశ్రమ వంటి కీలక విషయాల్లో ఆయన వైఖరిపై నెటిజన్లు పాత వీడియోలను, వార్తలను బయటకు తీస్తున్నారు.

2019 ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా అంగీకరిస్తూ, 33 వేల ఎకరాల భూమి చాలదని పేర్కొన్న జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తెచ్చారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు అవసరం లేదంటూ ప్రశ్నించిన ఆయన, ఆ తర్వాత దానికి సంబంధించిన క్రెడిట్ కోసం ప్రయత్నించారనే అంశాన్ని నెటిజన్లు పంచుకుంటున్నారు.

Advertisement

అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుపై కూడా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రతికూలంగా మాట్లాడిన జగన్, 2019లో అధికారంలోకి వచ్చాక ఆ పరిశ్రమ రాక వెనుక తన తండ్రి రాజశేఖర రెడ్డి కృషి ఉందంటూ మాట్లాడటాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు. నాయకుల పాత ప్రకటనలు, ప్రస్తుత మాటలను పోలుస్తూ నెటిజన్లు వరుసగా పోస్టులు పెడుతుండటంతో, ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పలేక వైసీపీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయి.

Advertisement