Advertisement

TGSRTC Ticket Price: బంపర్ ఆఫర్.. ఏసీ బస్సులపై 30% రాయితీ

మన పత్రిక, హైదరాబాద్: నగరంలో పెట్రోల్ కొరత భయంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నగర పరిధిలో తిరిగే మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల టికెట్ ధరలపై ఏకంగా 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు.

ప్రస్తుత ఇంధన సంక్షోభం, పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. “పెట్రోల్ కోసం ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా” అని నాగిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. క్యూలైన్లలో నిలబడి సమయం వృథా చేసుకోవద్దని, సొంత వాహనాల కోసం వేచి చూసే బదులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఆయన సూచించారు.

Advertisement

సొంత వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణాను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటంతో పాటు, నగరంలో ట్రాఫిక్, కాలుష్య సమస్యలు కూడా తగ్గుతాయని ఎండీ పేర్కొన్నారు. ఏసీ బస్సులు ఖరీదు అనుకునే సామాన్యులు సైతం తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించేలా ఈ 30 శాతం డిస్కౌంట్ కల్పించామని, నగరవాసులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement