Advertisement

పిహెచ్ జ్యువెల్స్ పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

మన పత్రిక, హైదరాబాద్: రూ.3.54 కోట్ల ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) రీఫండ్, పన్ను రహిత విదేశీ బంగారాన్ని దేశీయ మార్కెట్‌లోకి మళ్లించారనే ఆరోపణల వ్యవహారంలో పిహెచ్ జ్యువెల్స్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును పునఃపరిశీలించడానికి పన్ను అధికారుల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ దిశగా జరుగుతున్న చర్యలు కాలపరిమితి దాటిపోలేదని, పరిధికి మించినవి కావు అని వెల్లడించింది.

గతంలో పిహెచ్ జ్యువెల్స్ అనే రిటైల్ జ్యువెలరీ సంస్థకు రూ.3.54 కోట్ల రీఫండ్ మంజూరు చేస్తూ అసెస్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అనంతరం ఆ ఉత్తర్వును నిలిపివేశారు. ఆ రీఫండ్‌ను 30 రోజుల్లోగా చెల్లించాలని 2023 అక్టోబర్‌లో హైకోర్టు వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించింది. అయితే కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేపట్టిన విచారణకు సంబంధించిన వివరాలను పిహెచ్ జ్యువెల్స్ దాచిపెట్టిందని పేర్కొంటూ వాణిజ్య పన్నుల శాఖ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో 2024 జూన్‌లో హైకోర్టు తన పూర్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుని, కేసును కొత్తగా పరిశీలించేందుకు అనుమతించింది.

Advertisement

పరిమితి దాటిందన్న పిహెచ్ జ్యువెల్స్ విజ్ఞప్తి తిరస్కరణ

తెలంగాణ విలువ ఆధారిత పన్ను (VAT) చట్టం సెక్షన్ 32 ప్రకారం నాలుగు సంవత్సరాల గడువు ముగిసిందని, కాబట్టి రెండోసారి రీవిజన్ చేయడం చెల్లదని పిహెచ్ జ్యువెల్స్ వాదించింది. తాము నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఎటువంటి నిరూపిత ఆధారాలు లేవని పేర్కొంది. కానీ, సదరు సంస్థతో పాటు మరికొన్ని జ్యువెలరీ సంస్థలు ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసిన రూ.638 కోట్ల విలువైన 2,458 కిలోల పన్ను రహిత బంగారాన్ని, నకిలీ ఎగుమతి రశీదులతో దేశీయ మార్కెట్‌కు మళ్లించాయని అధికారులు ఆరోపించారు.

పిహెచ్ జ్యువెల్స్ ఎంఎంటీసీ ద్వారా 872 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసి, కేవలం 456.6 కిలోలు మాత్రమే ఎగుమతి చేసిందని వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. పాత షిప్పింగ్ బిళ్ల ఆధారంగా బ్యాంకుల నుంచి మరిన్ని ప్రయోజనాలు పొందారని, విమానాశ్రయ నివేదికలకు, సరుకు వివరాలకు మధ్య తేడాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నిజాలను దాచిపెట్టి ఉత్తర్వులు పొందడం కోర్టును మోసగించడమేనని అభిప్రాయపడిన హైకోర్టు, పిటిషన్లను కొట్టివేస్తూ రీవిజన్ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కంపెనీకి గడువు ఇచ్చింది.

Advertisement