భారత ఒలింపిక్స్ ఛాంపియన్ పరుగుల రాణి అని పిలువబడే PT ఉష (PT Usha) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పిటి ఉష భర్త వి. శ్రీనివాసన్ (V sreenivasan) గురువారం అర్ధరాత్రి మరణించడం జరిగింది. అందిన సమాచారం ప్రకారం పి.టి ఉష భర్త వి. శ్రీనివాసన్ తమ నివాసంలో గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అనగా శుక్రవారం తెల్లవారుజామున శ్రీనివాసన్ కుప్పకూలిపోయారు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే శ్రీనివాసన్ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 67 ఏళ్ల వయసు ఉన్న శ్రీనివాసన్ కోజికోడ్ జిల్లాలోని థిక్కోడి పెరుమాళ్పురంలో ఉన్న తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ను పెరుమాళ్పురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనివాసన్ పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తిగా PT ఉష క్రీడా అకాడమీలో అలాగే ఆమె బాధ్యతల నిర్వహణలో తోడుగా ఉంటూ అన్ని పనులు చూసుకునేవారు.
ఇక శ్రీనివాసన్ కుటుంబానికి వస్తే… కేరళలో పెన్నని సమీపంలో కుట్టిక్కడ్కు చెందిన నారాయణన్, సరోజినీ దంపతులు శ్రీనివాసన్ తల్లిదండ్రులు.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో డిప్యూటీ ఎస్పీ హోదాలో ఆయన రిటైర్ అయ్యారు. ఇక పీటీ ఉషకు అప్పట్లో దూరపు బంధువైన శ్రీనివాసన్ ఆమెను 1991 లో వివాహం చేసుకున్నారు. వీరికి డాక్టర్ ఉజ్వల్ విగ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు.
ఇక పిటి ఉష ఒలంపిక్స్ ఛాంపియన్ మాత్రమే కాకుండా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు కూడా, అలాగే రాజ్యసభ సభ్యురాలు కూడా. ఇక విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ (Narendra modi) పీటీ ఉషతో మాట్లాడి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
