మన పత్రిక: ఆంధ్రప్రదేశ్లో బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఊరట కలిగిస్తూ, ఆగస్టు 1వ తేదీ నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని విక్రయించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఏపీ ప్రజలకు అండగా నిలిచేందుకే కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని, దీని అమలుకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆయన కొనియాడారు.
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130 రైతుబజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ పంపిణీలో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ. 52 చొప్పున, గ్రేడ్-1 పచ్చి బియ్యాన్ని (రా రైస్) కిలో రూ. 50 చొప్పున విక్రయించనున్నారు.
బహిరంగ మార్కెట్ ధరలపై అత్యవసరంగా సమీక్ష నిర్వహించి, రైస్ మిల్లర్లతో చర్చించి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం సామాన్యుల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
