Advertisement

నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం

మన పత్రిక: నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంటులో చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని విపక్ష పార్టీల ఎంపీలు పట్టుబడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ గందరగోళం మధ్య లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల పాటు వాయిదా పడింది.

చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ ఘటనపై చర్చకు తాము గత మూడు రోజులుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చర్చలు నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన స్పష్టం చేశారు. చర్చ ఎప్పుడు జరగాలి, ఎంత సమయం కేటాయించాలి, ఏ నిబంధనలను పాటించాలనే అంశాలను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశ యువత భవిష్యత్తు దృష్ట్యా నిర్మాణాత్మకమైన చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement