Advertisement

భోగాపురం విమానాశ్రయంపై జగన్ వ్యాఖ్యలకు ఎంపీ కలిశెట్టి కౌంటర్

మన పత్రిక, విజయనగరం: భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ భోగాపురం వచ్చి, ఎర్రబస్సు సరిగ్గా రాని ఈ ప్రాంతానికి ఎయిర్‌పోర్ట్, ఎయిర్ బస్సులు ఎందుకు అని తీవ్రంగా అవహేళన చేశారని ఎంపీ గుర్తుచేశారు.

జగన్ సాధించిన ప్రత్యేక క్రెడిట్‌ను ఎవరూ దొంగిలించరని, ఒకవేళ ఆయన క్రెడిట్‌ను ఎవరైనా చోరీ చేస్తే చివరకు జైలుకే వెళ్లాల్సి వస్తుందంటూ సెటైర్ వేశారు. జగన్ మాటలను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

రాష్ట్రంలో నారా లోకేశ్ నాయకత్వంలో విద్యాశాఖ ఎంతో పారదర్శకంగా పనిచేస్తోందని, డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగకుండా నిష్పాక్షికంగా నిర్వహించారని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. లోకేశ్ విసిరిన సవాలును స్వీకరించలేక జగన్ వెనకడుగు వేశారని ఆయన విమర్శించారు.

Advertisement