Advertisement

గోవా రిసార్ట్‌లో క్యూనెట్ ప్రతినిధులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

మన పత్రిక, హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ QNET పేరిట లక్షల రూపాయల మోసానికి పాల్పడిన ఐదుగురు ప్రతినిధులను హైదరాబాద్ పోలీసులు గోవాలోని ఒక రిసార్ట్‌లో అరెస్ట్ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు జూలై 18న కాండోలిమ్‌లోని నోవోటెల్ రిసార్ట్ అండ్ స్పాలో నిర్వహించిన కంపెనీ కార్యక్రమంలో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మూడు వాహనాలు, డిజిటల్ ఆధారాలను జప్తు చేశారు.

అరెస్ట్ అయిన వారిని కేరళకు చెందిన మహమ్మద్ ఫవాజ్, అశ్విన్ సురేష్, వినూ అలియాస్ వినూ జాన్సన్ డిక్రూజ్, మనోజ్ రవీంద్రన్ నాయర్ సుబ్బలక్ష్మి, వరికోట్టుచాలిల్ శివరాజన్ బాల్‌రాజ్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులను గోవాలోని మాపుసా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, హైదరాబాద్‌కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ పొందారు. జిమ్ స్థలం కోసం చూస్తున్న సర్దార్ శరణ్‌పాల్ సింగ్ అనే వ్యక్తికి ఇన్స్టాగ్రామ్‌ ద్వారా ఫవాజ్ పరిచయమయ్యాడు. వ్యాపార ప్రతిపాదన పేరిట నమ్మించి రూ. 7.5 లక్షలు పెట్టుబడి పెట్టించడంతో పాటు గోవా ఈవెంట్ కోసం రూ. 30 వేలు కట్టించుకుని మోసం చేసినట్లు బాధితుడు జూలై 16న ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Advertisement

ఈ కేసు విచారణలో భాగంగా నిందితులకు చెందిన ఒక టయోటా ఫార్చ్యూనర్, మరో ఇద్దరు పరారీలో ఉన్న నిందితుల పేరిట ఉన్న కియా, ఎంజీ హెక్టర్ కార్లతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఉత్పత్తుల విక్రయాల కంటే సభ్యుల చేరిక ప్రాతిపదికగా సాగే మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లు చట్టవిరుద్ధమని, ఇటువంటి క్యూనెట్ తరహా సంస్థలలో చేరవద్దని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు సూచించారు.

Advertisement