Advertisement

గుంతకల్లు బళ్లారి రైల్వే లైన్ల ఆమోదంపై ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

మన పత్రిక: గుంతకల్లు – బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పనకు, రాష్ట్ర అభివృద్ధికి ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. Guntakal Ballari railway line ప్రాజెక్టును ఆమోదించినందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నూతన రైల్వే మార్గాల వల్ల రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానం గణనీయంగా పెరుగుతుందని చంద్రబాబు వివరించారు. ప్రయాణికుల సమయం తగ్గడంతో పాటు సరకు రవాణా వేగవంతమై, ప్రస్తుత మార్గాల్లో రద్దీ తగ్గుతుందన్నారు. మొత్తం రూ.1,264 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.600 కోట్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఖర్చు కానున్నాయి.

Advertisement

కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ లభించడం ద్వారా పరిశ్రమలకు ఊతం లభిస్తుందని సీఎం తెలిపారు. కొత్త ఆర్థిక అవకాశాలు వచ్చి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement