Advertisement

వాహనదారుల నుంచి వసూళ్లు: ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

మన పత్రిక, కామారెడ్డి: రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి అక్రమ వసూళ్లకు పాల్పడిన ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలోని మద్నూర్ పరిధిలో ఉన్న సలాబత్‌పూర్ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఈనెల 30న ఎక్సైజ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి విధుల్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన మరొక ప్రైవేట్ వ్యక్తితో కలిసి వచ్చిపోయే వాహనాలను నిలిపివేసి డబ్బులు డిమాండ్ చేశాడు. సదరు కానిస్టేబుల్ వసూళ్లకు పాల్పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పందించారు.

Advertisement

ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ కరీంనగర్ నోడల్ కార్యాలయానికి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కరీంనగర్ నోడల్ అధికారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సస్పెన్షన్ ఉత్తర్వులను సదరు కానిస్టేబుల్‌కు అందజేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి వెల్లడించారు.

Advertisement