Advertisement

రాజకీయ కుట్రలు పన్నుతున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ రెడ్డి ఫైర్

మన పత్రిక, కొడంగల్: తనను రాజకీయంగా దెబ్బతీయడానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రత్యేక తీవ్ర సవరణ (SIR) ప్రక్రియను పర్యవేక్షించిన ఆయన, క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా తన ఫారమ్‌ను నింపి అధికారులకు అందజేశారు.

బీఆర్ఎస్, బీజేపీలు బయటికి వేరుగా కనిపిస్తున్నా, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ, ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని ఆయన ప్రజలను హెచ్చరించారు. కొడంగల్‌లో ఇప్పటివరకు 78 శాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన

ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వీధుల్లో భారీ ధర్నా ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

Advertisement