మన పత్రిక, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరిగిన కీలక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన తదుపరి రాజకీయ లక్ష్యాన్ని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ చేసిన పోస్టును రీషేర్ చేస్తూ, తెలంగాణ బీజేపీ అధికారిక ఎక్స్ (X) హ్యాండిల్లో “నెక్స్ట్ తెలంగాణ” అని వ్యాఖ్యానించింది. దీంతో పార్టీ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమేనని స్పష్టమవుతోంది.
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల కమిషన్ తాజా గణాంకాల ప్రకారం బెంగాల్లో బీజేపీ 44 స్థానాల్లో విజయం సాధించి, 160 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార టీఎంసీ కేవలం 18 స్థానాల్లో గెలిచి, 65 చోట్ల ఆధిక్యానికే పరిమితమైంది.
ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అనూహ్యంగా ఓడిపోయారు. ఆయనపై వీ.ఎస్.బాబు సుమారు 8,000 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించారు. దేశవ్యాప్తంగా వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నడుమ బీజేపీ ఇప్పుడు తెలంగాణపై పూర్తిగా దృష్టి సారించింది.
